కర్నాటకలోని ఓ క్వారీలో అక్రమంగా నిల్వ ఉంచిన జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ జిల్లాలోని హీరానాగవేలిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ క్వారీలో కొన్ని రోజుల కిందట జిలెటిన్ స్టిక్స్ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు వాటిని ఉపయోగించేందుకు అనుమతి లేదని కాంట్రాక్టర్ తన సిబ్బందికి సూచించాడు. ఈ క్రమంలో సిబ్బంది ఆ జిలెటిన్ స్టిక్స్ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించగా ఈ ఘోర విషాదం సంభవించింది. పేలుడు ధాటికి ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడులో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనా స్థలాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కే సుధాకర్ సందర్శించారు. అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ చేసిన మైనింగ్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.