రామగుండం ఎన్టీపీసీ సమీపంలోని మల్యాలపల్లి వద్ద గల రాజీవ్ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీ గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బంగారు వ్యాపారులు కొత్త శ్రీనివాస్, కొత్త రాంబాబులు మరణించారు. వీరు ప్రయాణిస్తున్న కారు అతి వేగంగా వెళ్లి బోల్తా పడడంతో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే... బంగారం వ్యాపారం చేసే కొత్త రాంబాబు, కొత్త శ్రీనివాస్, శ్రీనివాస్ బావమరిది సంతోష్ మరో వ్యక్తి కారులో రామగుండం మీదుగా మంచిర్యాల బెల్లంపల్లి వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. కారు బోల్తా పడడంతో నలుగురు అందులో ఇరుక్కుపోయారు. స్థానికులు గమనించి బయటకు తీసే లోపే బంగారం వ్యాపారం చేసే రాంబాబు ప్రాణాలు కొల్పోయారు. ఆసుపత్రికి తరలించగా శ్రీనివాస్ మృతి చెందారు. డ్రైవర్ సంతోష్, శ్రీనివాస్ బావమరిది సంతోష్కు తీవ్రగాయాలు కాగా వారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను రామగుండం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బందికి కారులో పెద్ద ఎత్తున బంగారం కనిపించింది. దాంతో వెంటనే ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో బంగారంను స్వాదీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ. కోటి ఉంటుందని పోలీసులు అంటున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.