మహారాష్ట్ర రాష్ట్రం కరోనా మరణాల్లో రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు సంభవించిన రాష్ట్రంగా కరోనా పుస్తకంలో రికార్డు సొంతం చేసుకుంది మహారాష్ట్ర. ఈ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 50 వేలు దాటింది. మొత్తం దేశంలో కరోనాతో మృతి చెందిన ప్రతి ముగ్గురిలో ఒకరు మహారాష్ట్రకు చెందిన వారే.
ఆ రాష్ట్రంలో తొలి 10 వేల మరణాలకు 116 రోజులు పట్టగా.. తర్వాతి 10 వేల మరణాలు కేవలం 36 రోజుల్లోనే సంభవించాయి. ఆ తర్వాత 10 వేలకు 30 రోజులు, తదుపరి 10 వేలకు 25 రోజులు పట్టింది. చివరి 10 వేలకు మాత్రం.. కరోనా ఉధృతి తగ్గడంతో 90 రోజుల సమయం పట్టింది. ఒక్క ముంబై నగరంలోనే దాదాపు 11 వేల మంది మరణించారు. ఇది తమిళనాడు, కర్ణాటకలకు దాదాపు సమానం కావడం గమనార్హం. ప్రస్తుతం మహారాష్ట్రలో మరణాల రేటు 2.50గా ఉంది. ఇది జాతీయ సగటు (1.4) కంటే అధికం కావడం గమనార్హం.
మహారాష్ట్ర రాష్ట్రంలోని ప్రతి పదిమంది కరోనా మృతుల్లో ఏడుగురు.. ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారే. ఐదుగురు రెండేసి వ్యాధుల పీడితులు. 69.80 శాతం మంది పుషులు, 29.60 శాతం మంది మహిళలు (15 వేల మంది) 60-69 ఏళ్ల మధ్య వయస్కులు కాగా.. ప్రతి ఐదుగురు మృతుల్లో ఒకరు 50-70 ఏళ్ల మధ్య వారు. 46.70 శాతం మంది అధిక రక్తపోటు బాధితులు కాగా.. 39.40 శాతం మంది మధుమేహ వ్యాధి గ్రస్తులు. ప్రతి ఐదుగురిలో ఒకరికి ఈ రెండు వ్యాధులూ ఉన్నాయి.
మహారాష్ట్రలో వృద్ధుల జనాభా అధికంగా ఉండడమే దీనికి కారణమని, కొమార్బిటీస్ రోగులు కూడా ఇక్కడే అధికంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. అందుకే ఇక్కడ మరణాలు ఎక్కువగా సంభవించాయని భావిస్తున్నారు.