టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన తండ్రి నందమూరి తారకరామారావు నటజీవితం ఆధారంగా 'ఎన్టీఆర్ కథానాయకుడు' చిత్రం తీసిన విషయం విదితమే. ఈ సినిమాలో బాలకృష్ణ భీష్ముడి పాత్ర కూడా పోషించారు. అయితే సినిమా నిడివి పెరగడంతో భీష్ముడి పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను తొలగించారు. నేడు భీష్మ ఏకాదశి సందర్భంగా బాలకృష్ణ తాను భీష్ముని పాత్రలో నటించిన స్టిల్స్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘భీష్మ పాత్రంటే నాకెంతో ఇష్టం. నాన్న గారు, ఆయన వయసుకి మించిన భీష్మ పాత్ర పోషించి ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలను అందుకున్నారు. ఆ చిత్రం, అందులో నాన్నగారు నటించిన భీష్ముని పాత్ర అంటే నాకెంతో ఇష్టం. అందుకనే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో భీష్ముని సన్నివేశాలు తీశాము. అందులో నేను భీష్మునిగా నటించాను. అయితే నిడివి ఎక్కువ అవడం వలన ఆ చిత్రంలో ఆ సన్నివేశాలు ఉంచడం కుదరలేదు. ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆ పాత్రకి సంబంధించిన ఫోటోలను ప్రేక్షకులతో, అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నాను’’.. అన్నారు.